ర్యాంకర్ల చూపు ఉస్మానియా వైపు
దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ అనేక ఒడిదుడుకులను తట్టుకుని నేటికీ విద్యా బోధనతో పాటు ఇతర అంశాలలో కూడా ప్రముఖంగానే తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది.
ప్రకృతి రమణీయతతో, ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్జనకు అన్ని విధాలా అనువైన అతి విశాలమైన కేంపస్గల విశ్వ విద్యాలయం ఉస్మానియా. అంతర్జాతీయ స్థాయి అధ్యాపకులు, అద్బుతమైన మౌలిక సదుపాయాలు, ఆదర్శనీయమైన చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్జన చేయడం ప్రతి విద్యార్థి ఒక గర్వకారణంగా భావిస్తాడు. అందుకే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అందరి చూపూ ఉస్మానియా వైపే ఉంటుంది. నేటికీ అంతర్జాతీయ స్థాయి ప్రముఖ కంపెనీలన్నీ కేంపస్ ప్లేస్మెంట్స్ కోసం ఉస్మానియా యూనివర్సిటీకే ప్రాధాన్యత ఇస్తున్నాయంటే అది చెక్కుచెదరని ‘ఓయూ’ బ్రాండ్కి నిదర్శనం.
2004లో కేంపస్ ప్లేస్మెంట్ల సంఖ్య 118 నుంచి 2012లో 726కు పెరిగి, వన్నెతగ్గని ఉస్మానియా యూనివర్సిటీ ఘనత ఏటేటా పెరుగుదలనే సూచిస్తోంది. 2009లో ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ఐఐఎం. ఐఐటి, ఎన్ఐటి వంటి ప్రముఖ విద్యా సంస్థలలో కూడా కేంపస్ ప్లేస్మెంట్ల సంఖ్య గణనీయంగా పడిపోయిన సందర్భంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జరిగిన ప్లేస్మెంట్లు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఎందుకంటే ఆ సంవత్సరంలోనే ఓయూ కేంపస్ చరిత్రలోనే ఆల్టైం రికార్డు స్థాయిలో 619 ప్లేస్మెంట్ ఆఫర్లు జరిగాయి. ఆ తరువాత సంవత్సరం 2010లో జరిగిన ప్లేస్మెంట్ల సంఖ్య 584.
జూన్ 2011తో విద్యా సంవత్సరం అంతమయ్యే ఇంజనీరింగ్ డిగ్రీ బ్యాచ్కి 2010 జూలై నెల నుంచే కేంపస్ ప్లేస్మెంట్ల ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 2010లో జరిగిన ఒక ప్రత్యేక ప్లేస్మెంట్ ప్రక్రియ కొత్త రికార్డు సృష్టించింది. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ విభాగం డిసెంబర్ 12-22 వరకు ‘ప్రీమియం కంపెనీ రిక్రూట్మెంట్ డ్రైవ్’ నిర్వహించారు. 11 రోజుల పాటు జరిగిన ఈ కేంపస్ ప్లేస్మెంట్ శిబిరంలో ప్రముఖ ఐటి కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో టెక్నాలజీస్, కాగ్నిజెంట్, ఏక్సెంచుర్ పాల్గొన్నాయి. ఆ కంపెనీల వారు మొత్తం 478 జాబ్స్ ఆఫర్ చేశారు. ఈ ఉద్యోగాలను బిఇ, ఎంఇ, ఎంసిఎ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు ఆఫర్ చేయడం జరిగింది. ఇందులో కాగ్నిజెంట్ 179, ఇన్ఫోసిస్ 120, విప్రో 140, ఏక్సెంచుర్ 39. ఇదంతా విద్యార్థుల తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో జరగడం విశేషం.
2012 పాసింగ్ అవుట్ బ్యాచ్కి సంబంధించిన కేంపస్ ప్లేస్మెంట్లు సెప్టెంబర్ 2011లో జరిగాయి. అప్పుడు కూడా సెప్టెంబర్ 16-24 వరకు 9 రోజుల పాటు ‘ప్రీమియం కంపెనీ రిక్రూట్మెంట్ డ్రైవ్’ నిర్వహించారు. కాగ్నిజెంట్, విప్రో,ఇన్ఫోసిస్, ఎక్సెంచుర్ మొదలైన ప్రీమియం కంపెనీలు విద్యార్థులకు 593 ఉద్యోగాలను ఆఫర్ చేయడం జరిగింది.
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కేంపస్ ప్లేస్మెంట్లు ఇంతటి భారీ సంఖ్యలో జరగడానికి పాలకవర్గం, అధ్యాపకులు, సిబ్బంది కృషి ప్రశంసనీయం. 2009, 2010, 2011, 2012 వరుసగా నాలుగు సంవత్సరాల పాటు అంతర్జాతీయ ప్రముఖ ఐటి కంపెనీలు ఒకే యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కేంపస్ ప్లేస్మెంట్లలో పాల్గొనడం దేశంలోనే ప్రప్రథమం. ఆ ఘనత ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి దక్కుతుంది. ఈ ప్లేస్మెంట్లలో మరో గమనించదగిన విషయం ఏమిటంటే ఒక్కో విద్యార్థికి రెండు, మూడు కంపెనీల వారు జాబ్ ఆఫర్ ఇవ్వడం.
2012 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు కేంపస్ ప్లేస్మెంట్ల గణాంకాలను పరిశీలిస్తే దాదాపు 47 ప్రముఖ ఐటి తదితర కంపెనీలు యూనివర్సిటీని సందర్శించాయి. 726 జాబ్ ఆఫర్లు చేశాయి. కనిష్ట వేతన ఆఫర్ సంవత్సరానికి 4.2 లక్షలు. గరిష్ట వేతన ఆఫర్ 10.4లక్షలు (మైక్రోసాఫ్ట్). కేంపస్ ప్లేస్మెంట్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, మారుతి సుజుకి, ఎల్ అండ్ టి, ఐటిసి, మిథాని, బెల్, జిఇ, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, రెడ్పిన్ సిగ్నల్స్, మనీవేవ్, మొదలైన ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కేవలం ఉద్యోగావకాశాలు కల్పించడమే కాకుండా వారి కెరీర్ను ప్రయోజనకరంగా తీర్చిదిద్దడంలో కూడా ఓయూసిఇ ప్లేస్మెంట్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల ఉజ్వల కెరీర్ కోసం బాటలు వేస్తుందనే చెప్పాలి.
వ్యాసకర్త ః ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్, అసోసియేట్ ప్రొఫెసర్,
ఓయుసిఇ, ఉస్మానియా యూనివర్సిటీ.
Other News