మేథ్స్ బ్రెయిన్ అయితే ECE బెస్ట్
ఇంజనీరింగ్ ఏడెనిమిది బ్రాంచీలలో ఈ.సి.ఈ. కోర్సు నేటి అభ్యర్ధులకు టాప్ ఛాయిస్గా ఉంది. గత పదేళ్ళ గణాంకాలు తీసుకున్నా ఆయా బ్రాంచీలలో ఈ.సి.ఈ కోర్సు టాప్ ఫైవ్ బ్రాంచీలలో ఒకటిగా తన స్థానాన్ని పదిలపరచుకుంది. ఇక రెండు మూడేళ్ళ నుంచైతే వరుసగా నెంబర్వన్ ఛాయిస్గా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్నే విద్యార్ధులు ఎంచుకుంటున్నారు. నేడు మెజారిటీ అభ్యర్ధులు, వారి తల్లిదండ్రులు ఈ.సి.ఈ కోర్సులో సీటు లభించాలని కోరుకోవడంతో సదరు కోర్సుకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ఇంతకీ ఈ.సి.ఈ కోర్సులో నాలుగేళ్ళుపాటు అభ్యర్ధులకు ఏం నేర్పిస్తారు? కోర్సు పూర్తయిన తర్వాత ఏయే రంగాల వారికి రెడ్ కార్పెట్ పరుస్తుంటాయి? ఇంకా ఎటువంటి లక్షణాలుంటే ఈ.సి.ఈ కోర్సులో రాణించే అవకాశం ఉంటుందో తెలుసుకుందాం.
ఎలాంటి లక్షణాలుండాలి?
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మొత్తం కోర్సు సిలబస్లో యాభై శాతం వరకు మ్యాథమెటిక్స్ ఓరియెంటేషన్ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో ప్రాథమిక భావనలు బలంగా ఉన్న అభ్యర్ధులు ఈ.జి.ఈలో నేర్పించే అంశాలను స్పష్టంగా అర్ధం చేసుకుంటూ ఫాలో అవుతారు. సాధారణంగా ఇంటర్మీడియట్ రెండేళ్ళ మ్యాథమెటిక్స్ సబ్జెక్టును చదువుకుంటారు. దీనితో ప్రతి విద్యార్ధికి అంతో ఇంతో మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉంటుంది. అయితే, అతి కష్టం మీద మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో ఇంటర్, ఎంసెట్ పూర్తి చేసుకుని ఈ.సి.ఈ కోర్సులో చేరిన విద్యార్ధులు మాత్రం తగిన ప్రాక్టీసు చేయాలి. ఒక వైపు ఇంజనీరింగ్ పాఠాలు చదువుతూనే మరో వైపు మ్యాథమెటిక్స్పై , పై చేయి సాధించేలా రోజు ప్రత్యేకంగా సాధన చేస్తే ఈ.సి.ఈ. గ్రూపులో ఇమడగలుగుతారు. మ్యాథమెటిక్స్ ప్రాక్టీసులో ఒకే అంశాన్ని పదిసార్లు సాధన చేసినా జవాబు దొరకపోతే విద్యార్ధి కొత్త మార్గాన్ని అన్వేషించేలా కొత్త ఆలోచనలు చేసే లక్షణం ఉంటే ఈసిఈలో రాణిస్తారు. ఎన్ని అవకాశాలుంటే అన్నింటిలోనూ ప్రయత్నం చేస్తూ సమస్యా పరిష్కారాన్ని అన్వేషించే విద్యార్ధి ఈ.సి.ఈలో మెరిట్ సాధించ గలుగుతాడు. ఈ.సి.ఈలో సబ్జెక్టు అను నిత్యం అప్డేట్ అవుతూ మారుతుంది. ల్యాబ్ అంశాలు నేర్చుకునే విషయంలో ఫలానా సమయం వరకే ఇక్కడ నేర్చుకుంటాననే దృక్పథం గాకుండా, సమయం ఎప్పుడు దొరికినా ల్యాబ్ తరగతులను సద్వినియోగం చేసుకున్న వారే ప్రాక్టికల్ ఇంజనీర్గా మార్కెట్లో నిలబడతాడు. కాబట్టి ఎన్ని గంటలు చదువుతున్న విసుగు చెందని ఓపిక అభ్యర్ధులకు అలవాటుగా మారాలి. ఒక బృందంగా చదివే అవకాశం ఉన్నా ఇంజనీరింగ్లో వివిధ సమస్యలను సొంతంగా సాధన చేసే ఆసక్తి విద్యార్ధికి ఉండాలి.
ఈసిఈలో ఏమి నేర్పిస్తారు?
డివైస్ నుంచి ఒక సర్క్యూట్ తయారుచేస్తూ అవసరం ఉన్న దేనినైనా రూపొందించుకునేలా సామర్ధ్యం అభ్యర్ధికి వచ్చేలా ఈ.సి.ఈ కోర్సులో శిక్షణ ఇస్తారు. సి.ఎస్.ఇ చదివితే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విద్యార్ధులు కెరీర్ ప్రారంభిస్తారనే సంగతి తెలిసిందే. ఈ.సి.ఈ కోర్సులో కంప్యూటర్ సబ్జెక్టుపరంగా చూస్తే అభ్యర్ధులు హార్డ్వేర్ నాలెడ్జ్తో సిద్ధంగా ఉంటారు. చేతిలోని డివైస్తో కంప్యూటర్ మెమొరీ పెంచవచ్చా? కంప్యూటర్ స్పీడ్ పెంచవచ్చా? కంప్యూటర్ను మరింత సౌకర్యంగా సేవలు అందించేలా ఈ.సి.ఈ అభ్యర్ధులు ప్రతిభ చూపితే ఉద్యోగంలో రాణిస్తారు. ఈ.సి.ఈ చదివిన అభ్యర్ధులు సిగ్నల్ ప్రాసెసింగ్ను ప్రధానంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అన్ని రంగాలలో ప్రధానమైందిగా నేడు మనం చూసే ఆధునిక అవకాశాలు వచ్చాయి. తూనికలు కొలతలు మెషిన్స్ నుంచి విమానాల దిక్సూచీల వరకు గల అవకాశాలను ఈ.సి.ఈ అభ్యర్ధులు చేధిస్తున్నారు. మల్టీమీడియా నుంచి మొదలుకొని ఆటో మొబైల్, కారు మైలేజీ పెరగటం వరకు సిగ్నల్ ప్రాసెసింగ్ సబ్జెక్టు అనువర్తన ఉంది. ఈ.సి.ఈలో భాగంగా విద్యార్ధులు కమ్యూనికేషన్ వ్యవస్థను నేర్చుకుంటారు. సాంప్రదాయక పద్ధతుల నుంచి నేటి ఫేస్బుక్ వరకు అమలులో ఉన్న కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈ.సి.ఈ అభ్యర్ధులు నేర్చుకునేలా శిక్షణ ఉంటుంది.
ఏయే రంగాల్లో అవకాశం?
నేటి ప్రపంచం అంతా ఎలక్ట్రానిక్ మయం అయిపోతున్నందున ఈ.సి.ఇ విద్యార్ధులకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. డిఫెన్స్ నుంచి మొదలుకొని బయో ఇన్ఫర్మాటిక్స్ వరకు విభిన్న రంగాలు ఈ.సి.ఈ అభ్యర్ధులకు ‘రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. నిజానికి మొబైల్ నుంచి ఆటోమొబైల్ వరకు ఆయా రంగాలలో ఈ.సి.ఈ చదివిన అభ్యర్ధులకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కంప్యూటర్ రంగం నుంచి స్పేస్ రంగం వరకు ఈ.సి.ఈ. అభ్యర్ధులకు ఉద్యోగాలు లభించే స్థాయి కాబట్టి ఈ.సి.ఈ అభ్యర్ధులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా బిటెక్ పూర్తికాకముందే కంప్యూటర్ రంగంలో అపారంగా ఉద్యోగాలు వస్తున్న దృష్ట్యా మెజారిటీ అభ్యర్ధులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. కొంతమంది కోకో కంపెనీలవైపు వెళుతూ ఉపాధి అవకాశాలు చూసుకుంటున్నారు.
బిటెక్ తర్వాత స్పెషలైజేషన్స్ ః
గతంలో బిటెక్ పూర్తికాగానే 50 శాతం మంది ఎంటెక్ వైపు వెళ్ళేవారు. ప్రస్తుత జాబ్ మార్కెట్ దృష్ట్యా బిటెక్ ఫైనలియర్లో ఉండగానే ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు వస్తున్న దృష్ట్యా దానిని అందిపుచ్చుకోవాలనే దిశగా ఈ.సి.ఈ అభ్యర్ధులు అడుగులు వేస్తున్నారు. రెండేళ్ళపాటు ఉద్యోగాలు చేసి, ఆపై ఎంటెక్ కోర్సు లక్ష్యంగా పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ఎంచుకుంటున్నారు. బిటెక్ కోర్సులు పూర్తికాగానే 10 నుంచి 20 శాతం మంది అభ్యర్ధులు విదేశాలలో ఎంఎస్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎక్కువమంది ఉద్యోగాల్లో చేరుతుండగా 30 నుంచి 40 శాతం మంది అభ్యర్ధులే ఎంటెక్ ప్రోగ్రామ్వైపు వస్తున్నారు. ఈసిఈ బిటెక్ అభ్యర్ధులు 10కి పైగా ప్రత్యేక సబ్జెక్టులతో పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంటెక్ కోర్సును అభ్యసించవచ్చు. అవి ః 1. మ్రైకోవేవ్ అండ్ రాడార్ ఇంజనీరింగ్ 3. డిజిటల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ 3. సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ 4. ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఎల్ఎస్ఐ డిజైన్ కంట్రోల్ సిస్టమ్స్ 6. వి.ఎల్.ఎస్.ఐ 7. ఇన్స్ట్రుమెంటేషన్, 8. వైర్లెస్ కమ్యూనికేషన్ 9. బయో మెడికల్ ఇంజనీరింగ్ 10.మల్టీమీడియా వంటి ప్రత్యేక కోర్సులు లక్ష్యంగా ఎంటెక్ కోర్సులను అభ్యర్ధులు ఎంచుకుని ముందుకు సాగుతున్నారు.
ఎంసెట్ కన్వీనర్తో ముఖాముఖి
త్వరలో ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను జె.ఎన్.టి.యు. ప్రకటించనున్నది. వెబ్కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. కౌన్సిలింగ్ తేదీల కోసం లక్షలాది విద్యార్ధులు నిరీక్షిస్తున్నారు. తమ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుంది? ఏ బ్రాంచ్లో వస్తుంది? తమకు ఇష్టమైన బ్రాంచ్ వస్తుందా? లేక వచ్చిన దాంట్లో చేరిపోవాలా? కౌన్సిలింగ్కు ముందు ఏ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలి? ఏ సర్టిఫికెట్ ఎక్కడ నుంచి పొందాలి? మొదట కౌన్సిలింగ్ సీటు నచ్చకపోతే వదిలేయాలా? లేక ఉంచుకోవచ్చా? మరి అప్పుడు రెండో కౌన్సిలింగ్కు పిలుస్తారా? ఎన్ని కాలేజీలు, బ్రాంచ్లను ఆప్షన్స్గా ఇచ్చేందుకు వెబ్ కౌన్సిలింగ్లో అనుమతిస్తారు? ఇలా ఎన్నో సందేహాలు, సమాధానం లేని ప్రశ్నలు. అయితే ఎంసెట్ విద్యార్ధుల సందేహాలు నివృత్తి చేయడానికి ఎంసెట్ -01- కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్.వి.రమణారావు అంగీకరించారు. విద్యార్ధులు తమ సందేహాలను పంపవచ్చు.
Other News