ఒకరోజు నేను కొండాపూర్కి వెళ్లి పనులు చూసుకొని లోకల్ బస్లో మా కాలనీకి తిరుగు ప్రయాణమయ్యాను. ఎంతోసేపు నిల్చున్నాక ఓ బస్సు రద్దీతో వచ్చింది. నిల్చోవడానికి కూడా స్థలం లేదు. ఇంకో బస్సు కోసం వేచి చూడాలంటే.. మళ్లీ ఎంత సమయం పడుతుందో అనుకుంటూ అదే బస్సు ఎక్కాను. సీనియర్ సిటిజన్స్ సీట్లు కూడా ఖాళీగా లేవు. బస్సు నెమ్మదిగా వెళుతోంది. ఓ రెండు స్టేజీల తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకుంటూ నిల్చోవడానికి సందు దొరికింది. అప్పుడు వెనుక ఉన్న ఒకరిపై నా దృష్టి పడింది. ఓ పదహారేళ్ల కుర్రాడు, వాడి పక్కన ఓ పెద్దాయన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పక్కనే ఎంతో మంది ముసలివాళ్లు నిలుచున్నా ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు.
నేను మాత్రం ఆ కుర్రాడిని మనసులోని తిట్టుకోసాగాను. ‘ఈ కాలం కుర్రాళ్లు పెద్దలను గౌరవించడం లేదు. తెలివి ఎక్కువైన కొద్ది తల్లిదంవూడులను మరచిపోతున్నారు. కలికాలం అంటే ఇదే మరి’ అంటూ మనసులోనే నా కసి ఆ కుర్రాడిపై తీర్చుకుంటున్నాను. ఓ పది స్టేజీలు దాటాక బస్సు ఎల్.బి.నగర్ స్టేజీలో ఆగింది. ఇంతలో ఆ పెద్దాయన ఆ కుర్రాడిని చంకలోకి ఎత్తుకొని బస్సు దిగిపోయాడు. ఆ సీటు పక్కన కూర్చున్న ఇంకో ప్రయాణికుడిని ఆ కుర్రాడి గురించి వాకబు చేశాను.‘సార్! ఆ పిల్లవాడికి పుట్టినప్పట్టి నుంచి పోలియో వ్యాధితో పాటుగా, మెదడు కూడా సరిగా పనిచేయదు. ఆ పెద్దాయన అతని తాతగారట.’అని చెబుతుంటే ఆ కుర్రాడిని మనసులో తిట్టుకున్నందుకు పశ్చాత్తాపపడసాగాను. నిజం తెలియక ఎంతో తప్పుచేశానని బాధపడ్డాను. ఇప్పటికీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ దృశ్యమే కళ్లముందు కనిపిస్తుంది.
- పులిజాల రవీందర్రావు,
వనస్థలిపురం, హైదరాబాద్