వార్షిక పరీక్షలు సిద్ధం కావడమెలా?
స్కూల్ స్థాయిలో వార్షిక పరీక్షల హడావిడి మొదలైంది.
హాఫ్ ఇయర్లీ పరీక్షల ఫలితాలను చూసి టీచర్లు విద్యార్థులను ఏడాది పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. టెన్త్ పరీక్షలు మార్చిలో ప్రారంభమవుతుండగా, మిగతా క్లాసుల ఎగ్జామ్స్ ఏప్రిల్లో ఉంటాయి. వార్షిక పరీక్షలంటే ఇటు విద్యార్థులకు అటు టీచర్లకు, తల్లిదండ్రులకు, అందరికీ కాస్త టెన్షనే! అయితే శాస్త్రీయంగా ప్లాన్ చేసుకుంటే వార్షిక పరీక్షలను సునాయాసంగా దాటుకొని వెళ్ళవచ్చు. అదెలాగో చూద్దాం..
- ఫిబ్రవరి మాసంలో జరిగే నాల్గో యూనిట్ టెస్ట్తో ఈ విద్యా సంవత్సరం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సిలబస్ పూర్తవుతుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల సిలబస్ పూర్తికాని పక్షంలో ఆయా యాజమాన్యాలు తక్షణమే స్పందించి సిలబస్ను పూర్తి చేయించే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే విద్యార్థులకు మార్చి/ఏప్రిల్ మాసాల్లో జరిగే వార్షిక పరీక్షల్లో అన్ని సబ్జెక్ట్ల నుండి అన్ని యూనిట్స్ కవర్ అయ్యేలా ప్రశ్నలు వస్తాయనే విషయం మనకు తెలియంది కాదు.
- అదేవిధంగా విద్యార్థులు కూడా తమ నోట్స్ అన్నింటినీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆబ్సెంట్ అయినప్పటి నోట్స్, రాద్దామని వదిలేసిన బ్లాంక్ పేజీలు ఏవైనా ఉంటే ఇప్పటికైనా వాటిని పూర్తి చేసుకోవాలి. వాటిలో అర్థం కాని అంశాలను టీచర్తో ప్రత్యేకంగా చెప్పించుకోవాలి. లేదంటే క్లాస్మేట్స్తో చర్చించాలి. తమ క్వశ్చన్బ్యాంక్లో అన్నీ లాంగ్, షార్ట్, క్వశ్చన్స్ కవర్ అయ్యేలా చూసుకోవాలి. బిట్బ్యాంక్లో గల అన్ని బిట్స్ ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. అలా విద్యార్థులు ఒక సమగ్రమైన నోట్స్ను రివిజన్ కోసం తయారు చేసుకో వాలి.
టీచర్లు ఏం చేయాలి?
- ఒక్కొక్క విద్యార్థి నోట్స్ను సరిచూసి లోపాలను విద్యార్థులచే సవ రింపచేయాలి.
l సిలబస్లో కవర్కాని పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని వాటిని తక్షణం పూర్తి చేయాలి.
- నోట్స్లో పిల్లలకు ప్రశ్నల ప్రాధాన్యతను వివరించాలి. గుర్తులు ఉపయోగించి వాటిని నోటిపై చేయాలి.
- విద్యార్థుల లోపాలను విమర్శించకుండా వాటిని అనునయంగా చెబితేనే అనుకూల మార్పు వస్తుందని గమనించాలి.
- రివిజన్ ప్లాన్ రూపొందించుకొనడంలో విద్యార్థికి సహకరించాలి. అది అతడు ఎలా ఫాలో అవుతున్నదీ రెగ్యులర్గా చెక్ చేయాలి.
- విద్యార్థులకు ఇచ్చిన రివిజన్ ప్లాన్స్కు అనుగుణంగా రివిజన్ టెస్ట్లు రూపొందించాలి.
-రివిజన్ సమయంలో ఒక్కోవిద్యార్థి ఒక్కో సందేహం అడ గడం వల్ల టీచర్స్ అసహనానికి గురవు తుంటారు. అలా కాకుండా ఒక్కొక్కరి సందే హాలను సావకాశంగా తీర్చుతూ ఓపిగ్గా ముందుకు సాగాలి.
- డైలీప్లాన్ను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థు లను అందరి ముందు అభినందించాలి. పూర్తి చేయ లేని విద్యార్థుల కోసం కొంత అదనపు సమయాన్ని వెచ్చించి పూర్తి చేయించాలి.
- విద్యార్థులు గత వార్షిక ప్రశ్నాపత్రాలను ‘హోమ్ ఎగ్జామ్స్’గా రాయడానికి ప్రోత్సహించాలి. వాటిని ఇవాల్యూయేట్ చేసి ‘మార్కులే’ కాకుండా బాగోగులు చెప్పాలి.
- సమగ్రమైన నోట్స్/ మెటీరియల్ రూపొం దించుకున్న తరువాత ఒక్కొక్క యూనిట్లో ముఖ్యమైన, చాలా ముఖ్యమైన ప్రశ్నలను గుర్తించాలి. ముఖ్యమైన ప్రశ్నలకు స్టార్(*) గుర్తులు వేసి చదువుకోవడానికి సిద్ధం చేయాలి. గతంలో నాలుగు యూనిట్లు, నాలుగు అసైన్మెంట్లు, త్రైమాసిక, అర్థసంవత్సర పరీక్షల్లో అడిగిన ప్రశ్నల స్థాయిలో గల వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. బిట్స్ (షార్ట్-బిలో అడిగే ప్రశ్నలు) మాత్రం అన్నీ ప్రాక్టీస్ చేయాల్సిందే. స్టార్ గుర్తు గల ప్రశ్నల్లో గతంలో వదిలేసినవి ఉంటే వాటిని నేర్చుకోవడానికి మొదట ప్రయత్నించాలి. వాటిని నేర్చుకు న్నాకే రివిజన్ మొదలు పెట్టాలి.
- హాఫీయర్లీ ఎగ్జామ్స్లో 75% సిలబస్ కవర్ అయింది. అందులో ఏయే సబ్జెక్టులో ఎన్ని మార్కులొచ్చాయో మనకు తెలుసు. అందులో ఎక్కువ మార్కులు ఏయే సబ్జెక్టుల్లో స్కోర్ చేశాం? దేనిలో తక్కువ వచ్చాయి? ఆన్సర్స్ రాయడంలో ఎక్కడెక్కడ తప్పులు దొర్లాయి? అనే అంశాలకు ప్రాధా న్యత నిస్తూ వాటిని మళ్లీ చదవాలి. జవాబును పూర్తిగా అర్థం చేసుకుని 100% పరఫెక్ట్ అయినప్పుడు రివిజన్కు చాలా తక్కువ సమయం పడుతుంది. అదే విషయం సరిగ్గా అర్థం కాకపోయి ఉంటే దానిని మళ్లీ నేర్చుకోవాలి కనుక సమయం ఎక్కువ తీసుకుంటుంది. అంటే రివిజన్లో ఒక్కోరోజు ఒక చాప్టర్ మొత్తం కవర్ అయితే, మరో రోజు సగం కూడా అయిపోదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సమయ విభజన చేసుకోవాలి.
- 6 నుండి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు ఏప్రిల్ మాసం మధ్యలో ప్రారంభం అవుతాయి. వీరికి దాదాపు రెండు నెలల సమయం ఉంది. ఈ 60 రోజులను ఒక్కో సబ్జెక్ట్ను విభజిస్తే 10 రోజులే వస్తాయి. కనుక సమయం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఒక సబ్జెక్టును 10 రోజుల్లో రివిజన్ చేసుకోగలిగేట్లు ప్లాన్ చేయాలి. అంటే ప్రతి సబ్జెక్ట్లో రోజుకు ఒకటి లేదా రెండు యూనిట్లు పూర్తి చేయాలి. అలా ‘6’ సబ్జెక్టుల్లో ప్రతి రోజు రివిజన్ కంప్లీట్ అయ్యేలా ముందుకు సాగాలి. పదోతరగతి విద్యార్థులు మాత్రం ఇప్పటికే రివిజన్ ప్రారంభించి సగం కంప్లీట్ చేసి ఉంటారు. ఫిబ్రవరి మాసాంతానికి మొత్తం రివిజన్ కంప్లీట్చేసి మార్చి మొదటి వారంలో జరిగే ప్రీఫైనల్స్కు సిద్ధం కవాలి.
- ప్రీఫైనల్స్ నిర్వహించని 6 నుండి 9వ తరగతి విద్యార్థులు గత వార్షిక ప్రశ్నాపత్రాలను సంపాదించి రెండున్నర గంటల సమయం వ్యవధిగా పెట్టుకుని హోమ్ ఎగ్జామ్ను రాయాలి. ఆ సమాధాన పత్రాలను టీచర్స్తో వ్యాల్యూ చేయించుకొన్నట్లయితే మరోసారి తమ పురోగతిని పరీక్షించుకోచ్చు.
- ఏ విషయాన్నయినా మనం అర్థం చేసుకోగలిగితేనే తిరిగి ఇంకొకరికి చెప్పగలం. చెప్పగలగడమే కాకుండా సొంత మాటల్లో రాసి ఇవ్వగలం. మనకు అర్థం కాని విషయాన్ని ఇతరులకు చెప్పాలనుకున్నా, రాసి ఇవ్వాలనుకున్నా సాధ్యం కాదు. సరికదా సమయం వృథా అవుతుంది. పరీక్షల్లో కూడా కొందరు విద్యార్థులు అలా తమకు అర్థంకాని విషయాలను రాయబోయి ఏమీ రాయలేక సంబంధం లేని పదాలు, వాక్యాలు రాస్తుంటారు. ఇది ఎగ్జామినర్కు కోపం తెప్పిస్తుంది. ఫలితంగా సరిగా రాసిన సమాధానాలకు కూడా పొందాల్సిన మార్కులు పొందలేరు.
- అందుకే రివిజన్ సమయంలో విద్యార్థులు కేవలం సమాధానాలను పలుమార్లు వల్లె వేయడం (బైహాట్) కాకుండా అవగాహనతో (బై హార్ట్) చదవాలి. సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ ముందుకు సాగాలి. క్లాస్మేట్స్ను, టీచర్స్ను, అమ్మా నాన్నలను, సోదరు లను.. ఇలా ఎవరు అందుబాటులో ఉంటే వారిని అడిగి వివరణ తీసుకోవాలి. ఒక యూనిట్ రివిజన్ అయిపోయే ముందు మళ్లీ ఒకసారి వెనక్కి చూసుకుని అన్నీ నేర్చుకు న్నామో లేదో స్పష్టం చేసుకోవాలి. అన్నీ నేర్చుకుంటేనే మనం ఆ చాప్టర్ను సంతృప్తి కరంగా రివిజన్ చేసినట్లవుతుంది. అన్ని యూనిట్లు/ చాప్టర్స్ అలా పూర్తి చేస్తేనే రివిజన్ విజయవంతం అవుతుంది.
- ప్రతి రోజూ సాయంత్రం 5 గం॥ నుండి 9 గం॥ వరకు తిరిగి ఉదయం 5 గం॥ నుండి 7 గం॥ వరకు మొత్తం 6 గంటల సమయాన్ని ఇంటి వద్ద చదవడానికి కేటాయించాలి. తరగతి గదిలో ఉండే 6 గంటల సమయంలో రివిజన్ టెస్ట్లు రాయడం, సందేహాలు తీర్చు కోవడం, క్లాస్మేట్స్తో చర్చించ టం వంటివి చేయాలి. ఇలా రోజుకు 12 గంటల పాటు పరిశ్రమిస్తే తప్ప విద్యార్థి తన లక్ష్యం చేరుకోలేడని గ్రహిం చాలి. ఎక్కువ మార్కులు రావాలని అందరు విద్యార్థులూ కోరుకుంటారు. మరి ప్రతి రోజూ ప్లాన్ ప్రకారం చదివితేనే వారి కోరిక నెరవేరి సంతోషిస్తారన్న నిజాన్ని విద్యార్థులు గ్రహించాలి.
- ప్రతి యూనిట్ను రివిజన్ చేసిన తరువాత అందులోని ముఖ్యమైన ప్రశ్నలకు గల సమాధానాలను ఒకసారి రాస్తే మంచిది. రాసేటప్పుడు మక్కికి మక్కీ రాయాలని అనుకోకుండా స్వల్ప మార్పు, చేర్పులతో సొంత ముద్ర వేయడానికి ప్రయత్నించాలి. ఒక పదం స్థానంలో అదే అర్థం గల మరొక పదం వాడడం, చిన్న వాక్యాలను రెండింటిని ‘కంజంక్షన్’తో కలపడం, పెద్ద వాక్యాలను వీలైనచోట రెండు వాక్యాలుగా రాయడం. అర్థంలో తేడా రాకుండా ఉండేలా ఇలాంటి చిన్న మార్పులు చేయడానికి చొరవ చూపడం వల్ల విషయంపై, విషయ వ్యక్తీకరణపై మరింత పట్టు సాధించే అవకాశం ఉంది.
- విద్యార్థులకు ‘ఇష్టమైన’ సబ్జెక్టులు, ‘క్లిష్టమైన’ సబ్జెక్టులు వేర్వేరుగా ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఇష్టపడే సబ్జెక్టుల రివిజన్ తొందరగా ముగుస్తుంది. అది వారికి ‘ఈజీ’గా తోస్తుంది. ఇక క్లిష్టమని భావించే సబ్జెక్టులను చూస్తే, పుస్తకం తెరిస్తే చదవడానికి వారికి ఓపిక ఉండదు. అయితే పాఠశాల స్థాయిలో పదోతరగతి వరకూ కూడా మనం అన్ని సబ్జెక్టులనూ నేర్చుకోవాల్సి ఉందన్న వాస్తవం గ్రహించాలి.
క్లిష్టమైన సమాధానాలను కాస్త సమయం ఎక్కువ పట్టినా, కొంచెం కొంచెంగానైనా నేర్చుకోవడానికి విద్యార్థి సిద్ధం కావాలి.
- అలా ఒక్కొక్కటి నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి ‘సంక్లిష్టత’ అనే భూతం మాయమవుతుంది. అప్పుడు అన్నీ ఈజీగా, ఇష్టంగా అనిపిస్తాయని వేరే చెప్పనవసరం లేదు. సముద్రాన్ని చూస్తే చాలా విశాలంగా, ఎంతో లోతుగా అనిపిస్తుంది. అందులో ఉన్నది చిన్నచిన్న నీటి బిందువులేనని గ్రహించాలి. బిందువు బిందువు కలిస్తే సముద్రం అయినట్లే పదాలు, వాక్యాలు, సూత్రాలు, ప్రయోగాలు కలిసి ఏర్పడేదే క్లిష్టమైనదని భావించాలి. ఒక్కొక్క అంశాన్ని విడదీసి చూస్తే సౌలభ్యంగా ఉంటుంది.
- వ్యాసకర్త - అక్నాపూర్
జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్మాస్టర్.
Other News