తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించేందుకే..
- విజయమ్మ పర్యటనపై టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆగ్రహం
హైదరాబాద్, జూలై 22 (టీ మీడియా): ‘తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించేందుకే వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దీక్ష ముసుగులో సిరిసిల్ల పర్యటనకు వస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతుంటే విజయమ్మ మొండిగా పర్యటనకు సిద్ధమవడంలో ఆంతర్యమేమిటీ? కేవలం అధికార దాహం కోసమే విజయమ్మ తెలంగాణలో పర్యటించాలని చూస్తున్నారు. ఎంత చేసినా ఓట్లు, సీట్లు మాత్రం రావు’ అని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయమ్మ పర్యటన నేపథ్యంలో తెలంగాణవాదులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీమాంవూధలోనూ చేనేత కార్మికులు ఉన్నప్పటికీ కేవలం తెలంగాణలో పర్యటించడమేంటని ప్రశ్నించారు.
కేవలం జగన్ను సీఎం చేయడమే వైఎస్సార్సీపీ ఎజెండా అని విమర్శించారు. చంద్రబాబు, జగన్, సీఎం కిరణ్ కలిసి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మానుకోట గాయాలు ఇంకా మానకముందే విజయమ్మ పర్యటన ద్వారా మళ్లీ తెలంగాణవాదులను గాయాలపాలు చేసేందుకు సీమాంధ్ర సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సుమన్ దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబుకు 5 వేల మంది పోలీసులను రక్షణ ఇచ్చిన సీఎం కిరణ్.. ప్రస్తుతం విజయమ్మకు కూడా వేల మంది పోలీసులను రక్షణగా పంపుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్వీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బాబా ఫసియొద్దీన్, ఓయూ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, రంగాడ్డి తూర్పు విభాగం అధ్యక్షుడు రాంనర్సింహగౌడ్ పాల్గొన్నారు.
Other News