DSC@1968
అది 1968వ సంవత్సరం. ఆగస్టు నెల అనుకుంటా. సరిగా జ్ఞాపకం లేదు. జిల్లా పరిషత్ కార్యాలయం కరీంనగర్. దాదాపు రెండువందల యాభై స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం జిల్లా సెలెక్షన్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి ఆంధ్రా నుంచి ఐదు వందల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో గ్రాడ్యుయేట్లున్నారు. కానీ శిక్షణ పొందినవారు లేరు. ఇంటర్వ్యూలకు తెలంగాణ, ఆంధ్ర నుంచి అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరైనారు. అందులో నేనొక్కడిని. ఇంటర్వ్యూలు ఇంకా ప్రారంభం కాలేదు. అప్పుడే ఓ పెద్ద ఊరేగింపు. జిల్లా పరిషత్ కరీంనగర్ ప్రధానరోడ్డు మీద. రాజకీయ నాయకులులేరు. కేవలం విద్యార్థులే. ‘జై తెలంగాణ.. ఆంధ్రా గో బ్యాక్... ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ అంటూ నినాదాలు మిన్నంటాయి. బయట గొడవ చూసిన అప్పటి జిల్లా పరిషత్ ఛైర్మన్ డి.హన్మంతరావు ఈ నినాదాలకు స్పందించి వెంటనే డీఎస్సీని వాయిదా వేశారు.
అపాయింట్మెంట్ లెటర్స్ ఇంటికి పంపించనున్నట్లు చెప్పారు. నిరాశతో వెనుదిరిగాం. కానీ ఆశ్చర్యంగా ఆంధ్ర అభ్యర్థుల సర్టిఫికెట్లను మానేరులో పడేసి... కరీంనగర్ జిల్లా అభ్యర్థులను మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టింగ్స్ ఇచ్చారు. మా ఆనందానికి అవధులు లేవు. ఆ విధంగా రెండువందల యాభై కుటుంబాలు తెలంగాణలో బాగు పడ్డాయి. ఒక తెలంగాణ నినాదానికే ఇంత శక్తి ఉంటే... రేపు రాష్ట్రం ఏర్పడితే. మన కలలన్నీ సాకారమవుతాయి. అప్పటినుంచే తెలంగాణ కోసం ఏదైనా చేయాలని తపన బలంగా ఉంది. అలాంటి ఆశయాలకు ప్రతీకగా 27 ఏప్రిల్ 2001న కేసీఆర్ సభ. అందులో మెట్పల్లి నుంచి నేను పాల్గొన్నాను. అవసరమైతే ప్రధానోపాధ్యాయుని పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించాను. కానీ వద్దని చెప్పి నాకు ఐదు మండలాల బాధ్యతను అప్పగించారు.
నాటినుంచి నేటివరకూ మూడు సార్లు జైలుకు వెళ్లాను. అనేక ధర్నాలు, రాస్తారోకోలు, అన్ని ఉద్యమాల్లోనూ ముందున్నా. ఎంత ఉద్యమించినా తెలంగాణ వస్తలేదు. కానీ ఇప్పుడు చివరి దశలో ఉంది తెలంగాణ. ఇప్పుడు రాకుంటే ఇంకెప్పుడు రాదు. అందుకే ప్రతిఒక్కరం ఉద్యమంలో ముందుండాలే. లేకపోతే ఇప్పటికే మన యాస పోయింది, భాష పోయింది, సంస్కృతి, సాహిత్యం అన్నింటినీ కబ్జా చేశారు. చివరకు మనలనే లేకుండా చేస్తారు. అందుకే ఎత్తిన పిడికిలి దించొద్దు. మడమ తిప్పొద్దు. ఉద్యమం ఆపొద్దు. ఇంటి దొంగల పని పడుతూనే మన రాష్ట్ర సాధన కలను సాకారం చేసుకుందాం.
- గండ్ర ఆనందరావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు,
మెట్పల్లి, కరీంనగర్ జిల్లా
Other News