అమ్మ మనసు..
కుటుంబ వివరాలు తెలుసుకోకుండా పెళ్లి చేసినందుకు బిడ్డ ప్రాణం పోయింది. ఇద్దరు మనవరాళ్లు తల్లిలేని వాళ్లయ్యారు. వృద్ధాప్యంలో ఆ ఇద్దరి పిల్లల బాధ్యతలు మోయలేక .. వాళ్లను అనాథలను చేయలేక నరక యాతన అనుభవిస్తోందా తల్లి. అందుకే అమ్మాయి కదా తొందరగా పెళ్లి చేసేద్దాం అని ఆరాటపడకుండా వారి ఆర్థిక స్వావలంబన వచ్చేదాక చూడమని చెబుతుంది.
ఆ తల్లికథే ఇది...
హీనా ఫాతిమా... నా రెండో కూతురు. నా నలుగురు పిల్లల్లో ఎక్కువ ప్రేమ, అప్యాయతలున్నది. సాధారణ ముస్లిం కుటుంబాల్లోలాగానే నేను తనకు 17 ఏళ్లుండగానే 1998లో ఫిరోజ్ అహ్మద్ఖాన్కి ఇచ్చి పెళ్లి చేశాను. కానీ నేను చేసిన తప్పల్లా... అబ్బాయి కుటుంబం మా సంబంధం కావాలని వచ్చీ అడగ్గానే వాళ్ల పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోకుండా తొందరపడి పెళ్లి చేయడం. పెళ్లి తరువాత నాకు తెలిసింది.. అబ్బాయి తండ్రికి నలుగురు భార్యలని. నా అల్లుడు అసలు వ్యక్తిత్వం లేని మనిషని. ఏ పనీ చేతకాకి సోమరిపోతు అని. కానీ ఏం లాభం జరగాల్సింది జరిగిపోయింది. పెళ్లయిన సంవత్సరం వరకు బాగానే ఉన్నారు. ఆ తరువాత ఫిరోజ్ నా బిడ్డను ‘అది కావాలి, ఇది కావాలి’ అని వేధించేవాడు. బైక్ కావాలని అడిగితే వెంటనే కొనిచ్చాం... ‘ఉద్యోగం ఏమీ లేదుకదా! ఆటో నడిపిస్తాను కొనివ్వండి’ అన్నాడు. నా కూతురు సంసారం బాగుపడుతుందని వెంటనే అది కూడా కొనిచ్చాం. అవి రెండు ఇచ్చేసరికి డబ్బు అడగడం మొదపూట్టాడు. ఇంట్లో రోజూవారీ సరుకుల కోసం కూడా ‘మీ ఇంటి నుంచే తీసుకురా’ అని అమ్మాయిని వేధించేవాడు. ప్రతి చిన్నదానికి మా దగ్గరికి రావడం ఎందుకు అని అమ్మాయి ఊరుకుంటే విపరీతంగా కొట్టేవాడు. అయితే ఈ వేధింపులేవీ హీనా మాతో చెప్పలేదు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయినా వేధింపులు ఆగలేదు. సరికదా... భార్యా పిల్లల ముందే వేరే ఆడవాళ్లని ఇంటికి తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. అయినా పిల్లల క్షేమం కోసం హీనా అన్నీ ఓర్చుకున్నది. ఆమె ఓర్చుకునేకొద్దీ అతని చేతలు ఎక్కువయ్యాయి. అవేమీ చేస్తున్నా అతడిని పట్టించుకోకుండా ఉన్నందుకు ‘నువ్వు అందంగా ఉన్నావు... నీకు ఎంతమందితో సంబంధాలున్నాయో ఎవరికి తెలుసు? అందుకే నేను ఎవరితో తిరిగినా ఏం అనడం లేదు’ అంటూ కొత్తరకమైన వేధింపులు మొదలుపెట్టాడు. కొన్ని రోజులపాటు ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఇక ఆమె బయటికి వెళ్లకపోతే కుటుంబం గడవదు అనుకున్నప్పుడు బలవంతంగా ఆమె జుట్టు కత్తిరించి... ‘ఇప్పుడు నిన్నెవ్వరూ చూడరు’ అంటూ పైశాచికంగా ప్రవర్తించాడు. హీనా ఇవన్నీ ఎదుర్కొంటునే... అవమానాలన్నీ భరిస్తూనే అతనితో పదేళ్లపాటు ఉంది. కేవలం పిల్లలు, వాళ్ల భవిష్యత్, సమాజంలో వాళ్లకు గౌరవం ఉండాలని అలా చేసింది. 2008లో ఇద్దరికీ పెద్ద గొడవ జరిగింది. అప్పుడు మా ఇంటికి వచ్చేసింది. సంసారంలో ఉండే చిన్న గొడవలే అనుకున్నాం... కానీ తను ఇంటికొచ్చి చెప్పేంతవరకూ ఇవేవీ మాకు తెలియవు. 20 రోజుల తరువాత వాళ్ల మామ ఇంటికొచ్చాడు. ‘తల్లిలేకుండా పిల్లలు ఇబ్బందిపడుతున్నారు, వాళ్లను చూసుకోవడం మా వల్ల కావడం లేదు... హీనాను పంపించండి’ అని అడిగాడు. పంపించలేనని చెప్పి పనిమీద బయటికి వెళ్లాక హీనాను తనతో తీసుకెళ్లిపోయాడు.

హీనా అక్కడికి వెళ్లిన కొన్ని రోజులకే ఘోరం జరిగిపోయింది. ఓ రోజు బాగా తాగి ఇంటికొచ్చిన ఫిరోజ్... పిల్లలను ఆడుకొమ్మని చెప్పి బయటికి పంపించాడు. తలుపుకు తాళం వేసి అమ్మాయిని సిగట్తో కాల్చాడు. తనతో పాటు తెచ్చిన యాసిడ్ను బలవంతంగా తాగిపించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా... ఆమె ఛాతీపై కూడా యాసిడ్ పడింది. ఎంతగా అంటే ఎముకల నుంచి మాంసం ఊడిపోయి వేలాడింది... ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు హాస్పిటల్కు తీసుకెళ్లారు. విషయం తెలియగానే మేం కూడా హాస్పిటల్కు పరుగెత్తాం. నన్ను చూడగానే భోరున ఏడ్చింది. ‘అమ్మీ! నీతోనే ఉండాలని ఉంది. కానీ ఉండలేకపోతున్నాను. కాసేపు నీ ఒడిలో నన్ను పడుకోబెట్టుకో’ అంది. నేను ఒళ్లో పడుకోబెట్టుకోగానే ‘అమ్మీ! నా పిల్లల (అన్మోల్, సాహిల్)ను ఎప్పటికీ వదిలేయకు, వాళ్లను అనాథలను చేయకు’ అంటూ ఒట్టు వేయించుకుంది. 70 శాతం కాలిపోవడంతో ఒక రోజు తరువాత నా బిడ్డ చనిపోయింది. ఐపీసీ సెక్షన్ 320 ప్రకారం మైసూర్లోని ఉదయగిరి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశాం. అప్పటికే వాళ్ల దగ్గర నా అల్లుడు (ఫిరోజ్)కు సంబంధించిన కేసులు ఉండటంతో.. అతనిమీద సులువుగానే కేసు నమోదు చేశారు. తొందరగానే న్యాయం జరిగింది. అతడికి ఉరిశిక్ష వేయాలని నేను కోరుకున్నాను... కానీ కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. నేను నర్సరీ స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యాను. నా భర్త రైల్వేస్లో జాబ్ చేసి రిటైర్ అయ్యాడు... ఇప్పుడతని ఆరోగ్యం కూడా బాగలేదు. అతనికి వచ్చే 3వేల రూపాయల పెన్షన్తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. ఇంకా పెళ్లి చేయాల్సిన ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఉన్న ఇల్లు అమ్మేస్తే తప్ప మేం బతకలేని పరిస్థితి. హీనా పిల్లలను పెంచడం కూడా కష్టమవుతున్నది. నా బిడ్డలాగా మరో అమ్మాయి బలి కాకూడదు. అందుకే అమ్మాయికి పెళ్లి చేయడం కోసం తొందరపడకండి. ఆడపిల్ల ఆర్థికంగా ఎదిగితేనే భవిష్యత్. అంతేకాదు... అత్తారింట్లో కానీ.. బయట ఇంకెక్కడైనా కానీ ఏ రకమైన వేధింపులు ఉన్నా వెంటనే మీ కుటుంబానికి తెలియజేయండి. ఏవైనా వేధింపులు జరిగినా, కాల్చి చంపేసినా... కేస్ రిజిస్టర్ అయ్యేటప్పుడే జాగ్రత్త పడండి. నా కూతురు కేసు మర్డర్ కేసుగా రిజిస్టర్ అయ్యింది కాబట్టే తొందరంగా శిక్ష పడే అవకాశం కలిగింది. కానీ భారతదేశంలో జరుగుతున్న మహిళలపై హత్యల్లో దాదాపు 80శాతం కేసులు వంటచేస్తుండగా ప్రమాదం జరిగిందనో, గ్యాస్స్టవ్ పేలిందనో, కిరోసిన్ లీక్ అయిందనో మాత్రమే నమోదవుతున్నాయి. వాళ్లను బెదిరించి మరణవాంగ్మూలంలో సైతం అలాగే చెప్పిస్తున్నారు. తాను నిజం చెబితే తరువాత తన పిల్లలకు ఏమవుతుందోనని భయపడి అబద్ధపు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. పోలీసులు కూడా గుడ్డిగా కేసు రిజిస్టర్ చేస్తున్నారు. ఫలితంగా సరైన న్యాయం జరగడం లేదు. నష్టపరిహారం అందడం లేదు.
Other News