గౌరవాభిమానాలకు కొలమానం
విశ్వాసం అనేది బయటికి కనిపించే వస్తువు కాదు. మనిషి అంతరంగంలో దాగి ఉండే ఒక విచిత్ర వస్తువు. విశ్వాసం ఏ స్థాయిలో ఉంది అనే విషయాన్ని మనిషి తన గురించి తాను గూడా స్వయంగా అంచనా వేయలేడు. ఎవరిలో ఏ స్థాయిలో ఉన్నదో కొంతవరకు తెలుసుకోవడానికి దానికి కొన్ని చిహ్నాలు మాత్రమే ఉన్నాయి. మనిషి ఆచరణ, నడవడికలు, అభిరుచులు, అతని ప్రయత్నాల తీరుతెన్నులు మొదలైన వాటిని బట్టి అతని హృదయంలో ఉండే విశ్వాసం (ఈమాన్) స్థితిని అంచనా వేయవచ్చు అనే సత్యాన్ని మహా ప్రవక్త (స.అ.స) సూచించారు. వీటి సహాయంతో మనం మన విశ్వాసాన్ని కొలుచుకోవచ్చు. విశ్వాస ప్రక్రియలో ప్రధానమై అంశాలల్లో ఒకటి గౌరవాభిమానాలకు సంబంధించిన విషయం. మన హృదయంలో ఎలాంటి వారిపట్ల ఎక్కువ, తక్కువ గౌరవాభిమానాలున్నాయో మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం ద్వారా విషదమవుతుంది. నేడు ప్రజల్లో హోదా, అంతస్తు, అధికారం, సిరి సంపదలే గౌరవాభిమానాలకు కొలబద్దలయ్యాయి. సమాజంలో దుర్నీతి పరులు, అవినీతి పరులు, దుర్మార్గులు, మోసగాళ్లు, అబద్దాలు చెప్పేవారు, మానవహక్కులను హరించేవారు, నైతిక విలువలు పతనమైనవారు అనేకమంది ఉన్నారు.
ప్రజలు వారినే గౌరవవూపదులుగా గౌరవిస్తూ, పొగుడుతూ వారిని ఆకాశానికెత్తుతున్నారు. ప్రతిరోజూ పత్రికల ద్వారా, టీవీల ద్వారా నిరంతరం ప్రజల ముందు వారే కనిపిస్తున్నారు. వాళ్లంత తప్పుడు వ్యక్తులు, సమాజానికి నష్టం కలిగించేవారని తెలిసినా కూడా ప్రచార మాధ్యమాల ద్వారా వారిని గొప్పవారిగా సృష్టించే ప్రయత్నం నిరంతరం జరుగుతున్నది. ఇందుకు ప్రధాన కారణం డబ్బు, హోదా మాత్రమే. దీనికి భిన్నంగా నీతి, నిజాయితీ గల వ్యక్తుల విషయాన్ని తీసుకున్నట్లయితే సౌశీల్యం, సత్ప్రవర్తన, సద్గుణాలు, సమాజం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల చులకనభావం, పిరికివారిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నది. మంచికి, నీతి, నిజాయితీకి దూరం ఏర్పడుతున్నది. ఈ ధోరణి ఇస్లాం దృక్పథానికి, దాని బోధనలకు విరుద్ధం. ‘‘ఎవరైతే ఒక ‘బిద్అత్’కి గౌరవమిచ్చాడో, అతడు ఇస్లామ్ని అంతమొందించడంలో సహాయపడ్డాడు’’ అని మహావూపవక్త(స.అ.స) బోధించారు. ‘బిద్అత్’ అంటే ఇస్లామ్కు వ్యతిరేకమైన లేదా దాంతో పొసగని (సంబంధం లేని) ఒక కొత్త విషయాన్ని ఇస్లామ్లో ప్రవేశపెట్టడాన్ని బిద్అత్ అంటారు. మరొక సందర్భంలో ప్రవక్త (స.అ.స) ‘‘మునాఫిక్’’ని నాయకుడు అనకండి ఎందుకంటే అలా అంటే మీరు మీ ప్రభువుకు ఆగ్రహాన్ని తెప్పించినట్లయితది’’ అన్నాడు. మునాఫిక్ అంటే కపటి అని అర్థం. విశ్వాసిలా నటించేవాడు.
విశ్వాసం పట్ల, ఇస్లాం బోధనల పట్ల ఎలాంటి నమ్మకం లేనివాడు. అతని మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండదు. ఇలాంటివారిని నాయకులుగా ఎట్టి పరిస్థితులలో కూడా ఎన్నుకోకూడదని ప్రవక్త (స.అ.స) బోధించారు. నేడు మన రాజకీయ వ్యవస్థ మొత్తం ఇలాంటివారితోనే నిండి ఉన్నది. హృదయంలో దైవాన్ని విస్మరించినవారిపట్ల గౌరవాభిమానాలు ప్రారంభం అయితే అలాంటి హృదయంలో అల్లాహ్ ఔన్నత్యానికి, విశ్వాసులైన ఆయన దాసుల పట్ల అభిమానానికి చాలా తక్కువ స్థానం మిగులుతుంది. దైవాన్ని విస్మరించిన ప్రతి ధనికుడు, దేశాధినేత కంటే విశ్వాస భాగ్యం పొందిన ఒక పేదవాడే మోమీన్ దృష్టిలో ఎంతో గౌరవనీయుడు కాగలడు. ఇది విశ్వసించిన వ్యక్తి సహజ లక్షణం. మానవుడు తనకిష్టమైన వ్యక్తులు గొప్పతనాన్నే ఒప్పుకుంటాడు. దైవాన్ని మరిచినవారు, అధికార గర్విష్టులు, దుర్నీతిపరులు, అవినీతిపరులు నిజమైన విశ్వాసి దృష్టిలో ప్రియమైనవాళ్లు కాలేరు. అలాంటి వ్యక్తులను విశ్వాసి గొప్ప వాళ్లుగా భావించడు. ఎన్నటికీ వాళ్లను గొప్పవారిగా అంగీకరించడు. దైవ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు విశ్వాసి దృష్టిలో సామాన్య మానవులే. నేటి సమాజంలో అవినీతిపరులు తమ హోదా, అంతస్తులు ప్రదర్శిస్తూ పత్రికలు, టీవీల ద్వారా ప్రకటనల రూపంలో వారి గొప్పదనాన్ని ప్రదర్శిస్తూ సమాజాన్ని ఉద్ధరించే వారిలా వాఖ్యానాలు చేస్తూ ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఎవన్ని చేసినా కూడా సామాన్య మానవుడు, నీతి నిజాయితీని నమ్మినవాడు, విశ్వాసిపై ఇవి ఎలాంటి ప్రభావం చూపవు. ప్రజల్లో వారి పలుకుబడిని మాత్రం ఖాతరు చేయడు. అల్లాహ్ దృష్టిలో ఒక వ్యక్తి ఔన్నత్యానికి కొలమానం అతని సదాచరణ భయ భక్తులు మాత్రమే అని గ్రహించవలసి ఉన్నది. నిజమైన విశ్వాసి కూడా ఇవన్నీ కలిగి ఉంటాడు. ఒకవ్యక్తి ఎంత సౌశీల్యవంతుడో దేవుడు, దైవ ప్రవక్త (స.అ.స)ల పట్ల ఎంతగా విధేయుడయి, దైవ ధర్మంపై ఎంత స్థిరచిత్తంతో ఉంటాడో అతను అంతే ప్రేమపావూతుడవుతాడు. విశ్వాసి దృష్టిలో ప్రజల సిరిసంపదల కారణంగా, లేక హోదా పలుకుబడిల కారణంగా, ఇతర ప్రాపంచిక కారణాల వల్ల ప్రేమించడం, గౌరవించడం ఒక విశ్వాసికి తగనిపని. ఇలాంటి వైఖరిని ప్రతి ఒక్కరూ విడనాడాల్సి ఉన్నది. ప్రపంచం మొత్తం ధనవంతులు, దుర్నీతిపరులతో నిండి ఉంటే... నిజమైన విశ్వాసిని గుర్తించడం కష్టమవుతుంది. కానీ నిజమైన విశ్వాసి స్థానం మాత్రం దైవ దృష్టిలో, మహావూపవక్త (స.అ.స) దృష్టిలో ఉన్నతంగా ఉంటుంది.
నేడు సమాజం అవినీతి పరులకు నిలయమయ్యింది. వీరు ప్రధానంగా రాజకీయ, న్యాయ, చట్ట సభలో పోటీపడి మరీ వ్యవహరిస్తున్నారు. ఈ రోజు మనం గమనించినట్లయితే జైళ్లు మొత్తం ఇలాంటి వారితోనే నిండి ఉంటున్నవి. నిన్నటివరకు వారంతా గొప్పవాళ్లు, హోదా కలిగినవాళ్లు. సమాజానికి దిశానిర్దేశం చేసేటంత గొప్పగొప్ప ప్రసంగాలు చేసినవారే. కానీ వారంతా అవినీతిపరులుగా రుజువవుతున్నారు. కాబట్టి నిజమైన విశ్వాసి ఇటువంటి తాత్కాలికమైన ప్రదర్శనలలో వాస్తవాలను గుర్తించి వారిపట్ల కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. వీటి ద్వారా తమ విశ్వాస స్థితిని మెరుగుపరుచుకుని, దైవాన్ని చేరుకునే అంతిమమార్గాన్ని అనుసరించి, ఆచరిస్తారని, నిజమైన గౌరవాభిమానాలు పొందుతారని ఆశతో... అమీన్.. సుమ్మా అమీన్
- ఎం.డి.బాబర్ఖాన్, వలిగొండ, 9849897589
Other News