బోనమెత్తిన జన(గా)ం..
జనగామ, ఆగస్టు 12 (టీ మీడియా) : ‘దండాలు..దండాలూ..అమ్మోరు తల్లీ.. సల్లంగ సూడమ్మ.. మా కన్న తల్లీ’ అంటూ భక్తులు వేడుకున్నారు.. జనగామ పట్టణంలో ఆదివారం బోనాలు సందడి చేశాయి...ఎటు చూసినా పండుగ వాతావరణం కనిపించింది. శ్రావణ మాసం చివరి ఆదివారం కావడంతో పెద్దఎత్తున పోచమ్మ దేవతకు మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచే బోనాలు నెత్తిన పెట్టుకుని మహిళలు, పిల్లాపాపలతో పెద్దఎత్తున కుటుంబ సమేతంగా ఆలయానికి రావడంతో పోచమ్మ, మహంకాళి ఆలయాలు జనసంద్రంగా మారాయి. ఆలయ కమిటీ పోచమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మేకలు, కోళ్లను అమ్మవారికి బలిచ్చి మొక్కు లు తీర్చుకున్నారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. సాయంత్రం 5 గంటల నుంచే పట్టణంలోని స్వర్ణ కళామందిర్ థియేటర్ సమీపంలో గల మహంకాళీ దేవాలయంతో పాటు పోచమ్మ దేవాలయం, కళ్లెం రోడ్డులోని పోచమ్మ దేవాలయానికి, యశ్వంతాపూర్ రోడ్డులోని ఎల్లమ్మ దేవాలయానికి ప్రత్యేకంగా విడతల వారిగా మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్లాపాపలను, పాడిపంటలను చల్లంగా చూడు తల్లీ అంటూ గ్రామ దేవతలకు మొక్కుకున్నారు.
వైభవంగా మహంకాళి జాతర..
జనగామలో ప్రతి ఏటా జరిగే ఉజ్జయినీ మహంకాళి జాతర రాత్రి 10 గంటలకు నాగులకుంటలోని మున్సి పల్ మాజీ వైస్ చైర్మన్ కంచె రాములు ఇంటి నుంచి ప్రారం భమైం ది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి, రాములు ఇంటిలో మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారి విగ్రహాన్ని పొట్టేళ్ల రథంలో ప్రతిష్ఠిం చారు.
ఆ తర్వాత దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పేరొందిన కళాకారుల ఆటపాటలతో సంబరాలు జరుపగా, ఒంటెలు, గుర్రాలపై ఊరేగింపు, విచిత్ర వేషధారణల ప్రదర్శన, పోతురాజుల విన్యాసం, శివసత్తుల పూనకాలతో పట్టణ వీధులు అర్ధరాత్రి వరకూ కిటకిట లాడాయి. హైదరాబాద్ ల ష్కర్ బోనాల పండుగ తరహాలో జనగామలో జరిగిన మహంకాళి జాతర వేడుకలను తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. కలకత్తా కళాకారులు తీర్చిదిద్దిన రంగురంగుల వివిధ దేవతా మూర్తుల మెర్కూరీ లైట్లు ఆర్టీసీ చౌరస్తా నుంచి నెహ్రుపా ర్కు మీదుగా రైల్వేస్టేషన్ వరకు, జాతర ప్రారంభమయ్యే కంచె రాములు ఇంటి వరకు ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆ కర్షణగా నిలిచాయి.
హైదరాబా ద్ నుంచి తెప్పించిన ప్రత్యేక రథానికి పొట్టేళ్ల కట్టి అర్ధరాత్రి దాటేవరకు మేళ తాళాలు, బాణాసంచ మోతలు, నృత్యాల మధ్య ఊరేగింపు కన్నుల పం డువగా సాగింది. పొట్టేళ్ల రథం ఊరేగింపు, విన్యాసాలు, నృతాలు, బోనాల కార్యక్రమాన్ని జనం సెల్కెమెరా, వీడియో లో తీసుకునేందుకు ఎగబడ్డారు. ప్రధాన వీధులన్నీ విద్యుత్ కాంతులతో నిండిపోవడంతో రాత్రంతా జనగామ మహానగరాన్ని తలపించింది. పట్టణంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు చేయడంతో పట్టణ వీధులన్నీ పండుగశోభతో కళకళలాడింది.
Other News