తెలంగాణ కోసం మరో బలిదానం
-మెహంది పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నం
-ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి
-పరామర్శించిన ఎమ్మెల్యేలు
పరకాల, జూన్ 9 (టీన్యూస్): తెలంగాణ కోసం మరో వ్యక్తి ప్రాణాలు బలితీసుకున్నాడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు రోజు రోజుకు ఆలస్యమవుతుందని తట్టుకోలేని అతడు మెహంది పౌడర్ను నీళ్లల్లో కలుపుకొని తాగి ఆత్మహత్య యాత్నానికి పాల్పడ్డాడు. చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించగా ప్రాణాలు వదిలాడు. పరకాల ఉప ఎన్నిక నేపథ్యంలో స్థానికంగా చోటు చేసుకున్న ఈ సంఘటన శనివారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే కరీమ్నగర్జిల్లా గోదావరి ఖనికి చెందిన పర్స రాజేశం (42) ఎన్టీపీసీలోని సచ్దేవ్ స్కూల్లో బస్డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, కూతురు ఉన్నారు. పరకాలలో శనివారం టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనేందుకు రాజేశం మధ్యాహ్నమే వచ్చాడు. కాసేపు బస్టాండ్లోనే గడిపిన అతడు తనవెంట తెచ్చుకున్న బ్లాక్రోజ్ మెహంది పౌడర్ను నీళ్లల్లో కలుపుకొని తాగాడు. ఈ క్రమంలో అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని గమనించిన స్థానికులు పోలీసుల సహాయంతో పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ మేరకు పరీక్షించిన వైద్యులు అతడు సేవించిన మెహంది పౌడర్ను కక్కించారు. ప్రాణాపాయం లేదని ధృవీకరించిన వైద్యులు అతడికి స్లైన్ బాటిళ్లు ఎక్కించారు. ఈ విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, టీఆర్ఎస్అభ్యర్థి మొలుగూరి భిక్షపతి, స్థానిక నాయకులు రాజేశంను పరామర్శించారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అతడిని పరీక్షించిన వైద్యులు చికిత్స చేస్తుండగా రాత్రి 10గంటల సమయంలో మృతి చెందాడు. రాజేశం మరణ వార్త తెలుసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్రావు, వినయభాస్కర్, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, బీరవెల్లి భరత్కుమార్రెడ్డి, చింతం సదానందం తదితరులు హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు. రాజేశం మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
Other News