|
|
గ్రామాల్లో పెచ్చుమీరిన బెల్టుషాపులు
తాండూరు, జూలై 11 (టీ మీడియా): నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లో మండలానికి కనీసం 30 నుంచి 50 వరకు బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. గతంలో సిండికేట్ రేట్ల కారణంగా బెల్టుషాపుల్లో మద్యం విక్రయదారులు వైన్ షాపుల్లో కొనుగోలు చేసిన ధరలకు తోడు మరో 10 శాతం రేటు పెంచి మరీ మద్యాన్ని విక్రయించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చి లాటరీ పద్ధతిలో వైన్స్షాపులను కేటాయించడంతో మద్యం షాపులు దక్కించుకున్న వారికి ఆర్థిక వెసులుబాటు లభించింది. దీంతో ఎంఆర్పీ ధరలకే మద్యాన్ని విక్రయిస్తున్నారు. దీంతో వైన్ షాపుల్లో ఎంఆర్పీ ధరలకు మద్యం లభించడం బెల్టుషాపుల వారికి లాభాలను పండిస్తోంది. వైన్స్షాపుల్లో రూ. 70కి కొనుగోలుచేసిన బీర్ బాటిళ్లు రూ. 90కి విక్రయిస్తున్నారు. అలాగే విస్కీ బాటిళ్లను కూడా 10 శాతం ధర పెంచి విక్రయిస్తున్నారు. దీంతో గతంలో బెల్టుషాపుల్లో ఎక్కువ ధరలు పెట్టి కొనుగోలు చేసే వారు ఈ సారి 10 శాతం తగ్గింపు ధరలకు లభిస్తుండడంతో బెల్టుషాపుల్లో మద్యం కొనుగోలు చేసేందుకు మద్యం ప్రియులు ఎగబడుతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కనీసం 150కి పైగా బెల్టుషాపులు కొనసాగుతుండడం గమనార్హం. సిండికేట్ వ్యవహారంపై ఏసీబీ దాడులకు దిగిన నేపథ్యంలో రెండు నెలల క్రితం మండలాల వారిగా బెల్టుషాపులపై ఎక్సైజ్ అధికారులు సర్వే నిర్వహించారు. గ్రామ కార్యదర్శుల చేత ఈ సర్వేను కొనసాగించారు. కాగా బెల్టుషాపుల యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. ఒకరిద్దరు బెల్టుషాపుల యజమానులపై కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు మిగిలిన వారిని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతోవారి ఆగడాలకు అదుపు లేకుండాపోయింది. ఈ కారణంగా నియోజకవర్గంలోని పెద్ద గ్రామాల్లో 2 నుంచి 3 వరకు బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని నాపరాళ్ల గనులున్న మల్కాపూర్, బెల్కటూర్, ఓగీపూర్, సిరిగిరిపేట, జిన్గుర్తి, పెద్దేముల్ మండలం కోట్పల్లి, మంబాపూర్, కందనెల్లి, యాలాల మండలం జుంటుపల్లి, లక్ష్మీనారాయణపూర్, బషీరాబాద్ మండలం ఎక్మాయి, దామర్చేడ్, నవల్గా, మంతట్టి, రెడ్డిగణాపూర్, కాశీంపూర్ గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు వెలిశాయి. కాశీంపూర్ గ్రామంలోని బెల్టుషాపుల్లో రూ. 30 వేలకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. నియోజకవర్గంలో నాపరాళ్ల గనులున్న ప్రాంతాల్లో, సిమెంట్ కర్మాగారాలున్న ప్రాంతాల్లో 5 నుంచి 10 వరకు బెల్టుషాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు యథేచ్చగా కొనసాగిస్తున్నారు. నూతన మద్యం పాలసీ ప్రకారం బెల్టుషాపులపై చర్యలు తీసుకోని ఎక్సైజ్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఆదేశాలను అమల్లోకి తీసుకొచ్చారు. అయితే నియోజకవర్గంలో కనీసం 150కి పైగా బెల్టుషాపులు యథావిధిగా కొనసాగుతుండడం గమనార్హం. ఒకవైపు వైన్ షాపుల్లో ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయిస్తున్నప్పటికీ బెల్టుషాపుల్లో కొందరు ఇష్టానుసారంగా మద్యం రేట్లను నిర్ణయించి విక్రయిస్తున్నారని సమాచారం. ఎక్సైజ్ అధికారులకు వ్యవహారం తెలిసినప్పటికీ బెల్టుషాపులపై చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Other News
|