ప్రాణం తీసిన ఆస్తి తగాదా
-నిద్రిస్తున్న తండ్రిని గొడ్డలితో నరికిన కొడుకు
-రాగంపేటలో కలకలం
-సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ
చొప్పదండి, జూన్ 9 (టీన్యూస్): ఆస్తి పంపకాల విషయంలో గొడవలు కావడంతో కొడుకే తండ్రిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన చొప్పదండి మండలం రాగంపేటలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాగంపేట గ్రామానికి చెందిన బుచ్చయ్యకి ఇద్దరు కొడుకులు అంజయ్య, గట్టయ్య, ఒక కుమార్తె శంకరమ్మ ఉన్నారు. తండ్రి పేరు 10.26 ఎకరాల భూమి ఉంది. మూడు నెలల కిందట భూపంపకాలు పెద్దల సమక్షంలో జరిగాయి. అప్పు 2లక్షల 10 వేలు ఉండడంతో తండ్రి వాటిని తలా లక్షా ఐదువేల రూపాయలు అప్పు కట్టి భూమిని సాగు చేసుకొమ్మని ఇద్దరు కొడుకులకు చెప్పాడు. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయమై చొప్పదండి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు సైతం చేసుకున్నారు. ఈ తరుణంలో శుక్రవారం అర్ధరాత్రి ఇంటి బయట బుచ్చయ్య నిద్రిస్తుండగా చిన్నకొడుకు గట్టయ్య తండ్రి మెడపై గొడ్డలితో నరికి చంపాడు. సంఘటన స్థలాన్ని సీఐ కృష్ణాగౌడ్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పవూతికి తరలించారు.
Other News